మట్టి చేతులు


ఒకడు నీ రక్తాన్ని తాగి
స్వేదంతో స్నానం చేసుకుంటాడు ...
మరొకడు నీ రెక్కల్ని వాడుకొని
వాడి డొక్క నింపుకుంటాడు...
ఇంకొకడేమో నీ కండల్ని కరిగించి
కనకపు కుర్చీలో కూర్చుంటాడు...
అనేకమంది
నీ అమాయకత్వాన్నో
నీ శ్రమించే వ్యక్తిత్వాన్నో
అలుసుగా చేసుకొని
నలుసులా నిన్ను నలిపేసారు....
ఎందరో
నీ మట్టి చేతులను తొక్కిపెట్టాక
నీ మెత్తని కుత్తుకఫై కత్తిపెట్టాక
ఆఖర్లో నిస్సాహాయతతో ఏడుస్తావెందుకు?
ప్రశ్నించడం చేతగాక చచ్చిపోతావెందుకు?
వొక విరగకాసిన తెంపరితనంతో
బాధల బందీఖనాలో బానిసత్వాన్నితెంపుకొని
ఒక్కసారి చచ్చిపోకుండా....
పోరాడుతూ ప్రతిరోజూ బ్రతుకవోయ్...బ్రతుకు...
జీవులకు తిండిగింజలు పెట్టే పచ్చని మొక్కలా  
కోట్ల కర్షకులకు ఆదర్శంగా
మా స్వార్థం కోసమైనా
ఇంకొన్నేళ్ళు బ్రతకవోయ్ భగవద్స్వరూపుడా!!!



4 comments:

  1. మానవత్వం మరిచిన రోజునా..
    మనిషి మనసు కరుడుగట్టిన రోజునా..
    బాంధవ్యాల విలువలు మంటగలసిన రోజునా..
    ఎన్ని సోపానాలు అధిరోహించినా అధఃపాతాళం లో కూరుకుపోతారు..

    కనువిప్పు కలిగించే కవిత కుసుమం.. కలచి వేసే చేదు నిజం.. కాని అంతర్గతంగా ప్రతి ఒక్కరు మానవత్వపు అంచులదరిలో పూలమాలలేనని తెలియజేసే కావ్యం వినోద్ గారు..

    ReplyDelete
  2. పేరులోను రాతల్లోను నూతనత్వం

    ReplyDelete
  3. మరో అధ్భుత సృష్టి మీ కవిత విష్వక్సేనగారు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...